మంచి స్నేహితుడిని కోల్పోయానన్న రఘురామకృష్ణరాజు.. టాలీవుడ్ కు తీరని లోటు అన్న రేవంత్ రెడ్డి

  • తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణంరాజు
  • రెబల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారన్న రేవంత్ రెడ్డి
  • కృష్ణంరాజు మృతి వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న రఘురాజు
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు 83 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణంరాజు మృతి పట్ల టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని.. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నానని చెప్పారు. 

కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కృష్ణంరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఒక మంచి స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Krishnam Raju
Tollywood
Revanth Reddy
Congress
Raghu Rama Krishna Raju
YSRCP

More Telugu News